2020 ఆగస్టు 15.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించిన కొద్దిసేపటికే సురేశ్ రైనా కూడా అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఒకే రోజు ఇద్దరు స్నేహితులు ఆటకు గుడ్బై చెప్పడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
అయితే ధోనితో పాటు తాను కూడా ఎందుకు రిటైర్ అయ్యాడో రైనా తాజాగా వెల్లడించాడు. 33 ఏళ్ల వయసులోనే ఆటకు వీడ్కోలు చెప్పడం వెనుక కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఆలోచన ఉందని తెలిపాడు.
ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో ఆయన వద్దకు వెళ్లి “అంతా అయిపోయింది” అని చెప్పానని రైనా గుర్తుచేసుకున్నాడు. తన మాటలు విన్న ధోని ఒక్కసారిగా ఆశ్చర్యపోయి “ఏం చేశావ్ నువ్వు?” అని ప్రశ్నించాడని తెలిపాడు.
రైనా కోసం ధోని చేసిన త్యాగం ఏంటి?
ధోని తనపై ఉంచిన నమ్మకాన్ని రైనా ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నాడు. సౌరభ్ గంగూలీ కెప్టెన్గా ఉన్నప్పుడు టాపార్డర్లో ఆడిన ధోని.. తర్వాత యువరాజ్ సింగ్, రైనాలను టాపార్డర్లోకి పంపించి తాను ఫినిషర్గా మారాడని చెప్పాడు.
“ధోని తన బ్యాటింగ్ స్థానాన్ని నా కోసం త్యాగం చేశాడు” అని రైనా పేర్కొన్నాడు. తన సామర్థ్యాలపై ధోని తనకంటే ఎక్కువ నమ్మకం ఉంచాడని, అందుకే ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ ఏదైనా పూర్తిస్థాయిలో రాణించాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.
“మా స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుంది”
తమ ఇద్దరి మధ్య ఉన్న బంధం కేవలం క్రికెట్కే పరిమితం కాదని రైనా తెలిపాడు. మనసుతో ఏర్పడిన అనుబంధాలు జీవితాంతం కొనసాగుతాయని, ఒకరి కోసం మరొకరు చేసిన త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పాడు.
“అందరికీ డబ్బు ఉండొచ్చు.. కానీ దాన్ని పంచే పెద్ద మనసు ఉండాలి. మా స్నేహంలో అలాంటి పెద్ద మనసు ఉంది” అంటూ ధోనితో తన అనుబంధాన్ని రైనా గుర్తుచేసుకున్నాడు.






