తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బకాయిల చెల్లింపులో మరింత జాప్యం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా మిలిటెంట్ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.
బీసీ విద్యార్థి సంఘం చేపట్టిన హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్. కృష్ణయ్య, ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై ప్రశ్నించగా తాను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, కాబట్టి ఏపీలోనే పోరాటం చేయాలన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు.
ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత మేర బకాయిలు ఉన్నప్పటికీ, అక్కడ అమలవుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ విధానం తెలంగాణ కంటే మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. ఏపీలో విద్యార్థుల పూర్తి ఫీజును ప్రభుత్వం భరిస్తోందని, తెలంగాణలో మాత్రం ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.35 వేల వరకు, డిగ్రీ విద్యార్థులకు రూ.15 వేల వరకు మాత్రమే అందుతోందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా విద్యార్థుల పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసిన ఆర్. కృష్ణయ్య, బకాయిల విడుదలతో పాటు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
