ప్రాజెక్టును NHAIకి బదిలీ చేసిన కేంద్రం.. పెరగనున్న వ్యయం.. కొత్త DPRకు కసరత్తు
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం వైపు ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రతిపాదించిన శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు మోర్త్ పరిధిలో ఉన్న సుమారు 54 కిలోమీటర్ల కారిడార్ను పనుల పర్యవేక్షణ సులభతరం చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ NHAIకి బదిలీ చేసినట్లు సమాచారం. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన DPR, టెండర్లు, నిర్మాణ పనుల పర్యవేక్షణ వంటి అంశాలు ఒకే సంస్థ పరిధిలోకి రానున్నాయి.
2 లేన్లకు బదులు 4 లేన్లు
భవిష్యత్తులో పెరగనున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని కారిడార్ను 2 లేన్లకు బదులుగా 4 లేన్లుగా నిర్మించేందుకు NHAI అధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఒకే పిల్లర్పై రెండు వైపులా వాహనాలు ప్రయాణించే విధంగా నిర్మాణాన్ని చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
అయితే 4 లేన్లకు విస్తరించడం వల్ల పర్యావరణంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దాదాపు 2 లక్షల చెట్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో అధికారులు కొత్త సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.
రాష్ట్ర వాటా ఎంత?
గతంలో ప్రతిపాదించిన 2 లేన్ల ప్రాజెక్టు ప్రకారం మొత్తం వ్యయంలో 50 శాతం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందులో రూ.2,541 కోట్లను నేరుగా సమకూర్చడంతో పాటు మిగిలిన మొత్తాన్ని పన్ను మినహాయింపుల రూపంలో అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ఇప్పుడు ప్రాజెక్టు NHAI పరిధిలోకి రావడం, 4 లేన్ల ప్రతిపాదన తెరపైకి రావడంతో నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం–తెలంగాణ ప్రభుత్వాల మధ్య ప్రాజెక్టు వ్యయం, రాష్ట్ర వాటా, కొత్త DPRపై త్వరలో చర్చలు జరిగే అవకాశం ఉంది.
