మోదీకి గవర్నర్ అశోక్ గజపతి రాజు ప్రత్యేక ఆహ్వానం.. సింహాచలం రావాలంటూ పిలుపు
న్యూఢిల్లీ: గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. గవర్నర్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మర్యాదపూర్వక భేటీ జరిగింది.
సమావేశంలో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని గవర్నర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా సింహాద్రి అప్పన్న స్వామివారి ప్రతిమను మోదీకి అందజేశారు.
ఆలయ ట్రస్ట్ తరఫున ప్రధానికి ఆహ్వానం అందించినట్లు అశోక్ గజపతి రాజు తెలిపారు. తన ఆహ్వానంపై మోదీ సానుకూలంగా స్పందించారని, త్వరలో సింహాచలం వచ్చి స్వామివారిని దర్శించుకుంటానని హామీ ఇచ్చారని వెల్లడించారు.
ఇక గోవాలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రాజెక్టుల పురోగతిని కూడా ప్రధానితో చర్చించినట్లు గవర్నర్ తెలిపారు.






