● 299 డివిజన్ కాంగ్రెస్లో అధ్యక్ష పదవి వివాదం
● పదవి రాకపోవడంతో బండారు నరేందర్ రాజీనామా
● తనకు అన్యాయం జరిగిందని ఆరోపణలు
● నరేందర్కు మద్దతుగా కార్యకర్తల సామూహిక రాజీనామాలు
● కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి
అధ్యక్ష పదవి వివాదంతో బండారు నరేందర్ రాజీనామా.. కార్యకర్తలూ బాటలోనే!
TGN NEWS (గుండ్లపోచంపల్లి): మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర రాజకీయ గందరగోళం నెలకొంది. డివిజన్ అధ్యక్ష పదవిని ఆశించిన కాంగ్రెస్ నాయకుడు బండారు నరేందర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
పార్టీ అధిష్ఠానం ఈరోజు విడుదల చేసిన డివిజన్ అధ్యక్షుల జాబితాలో తొలుత తన పేరు ప్రకటించి, అనంతరం అనూహ్యంగా మార్పులు చేసి తనకు పదవి దక్కకుండా చేశారని బండారు నరేందర్ ఆరోపించారు. కొందరు నాయకులు తమ స్వప్రయోజనాల కోసం జోక్యం చేసుకుని తనకు అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన బండారు నరేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. దీంతో 299 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి.
ఈ రాజీనామాల ప్రభావం స్థానిక రాజకీయాలపై ఎంతవరకు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం ఎలా స్పందిస్తుందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.





