గంటల తరబడి చేసే రివ్యూలు కాదు… నాకు క్షేత్రస్థాయిలో ఫలితాలు కావాలి. రియాక్టివ్ (ప్రతిస్పందించే) పాలన నుంచి ప్రో-యాక్టివ్ (చురుకైన) పాలన దిశగా అధికారులు మారాలి. ఆలోచనలు అద్భుతంగా ఉన్నా, వాటిని అమలు చేయకపోతే అవి నెరవేరని ఆశలుగానే మిగిలిపోతాయి” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు.
రాష్ట్ర సచివాలయంలో గురువారం ప్రారంభమైన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. రెండు రోజుల పాటు మొత్తం 12 గంటల పాటు సాగే ఈ కీలక సదస్సులో తొలిరోజు, పాలనలో తీసుకురావాల్సిన మార్పులు, అభివృద్ధి లక్ష్యాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
‘వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్’.. ఇదే మన మిషన్
ప్రజా సేవకులుగా అహంభావాలకు తావివ్వకుండా పనిచేయాలని సూచించిన ముఖ్యమంత్రి, నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాలంటే ముందుగా యాజమాన్య బాధ్యత (ఓనర్షిప్) తీసుకోవడం అలవర్చుకోవాలని హితవు పలికారు. “ఫైల్ పెండింగ్లో ఉందంటే అభివృద్ధి పెండింగ్లో ఉన్నట్టే. ఫిర్యాదు పెండింగ్లో ఉందంటే ప్రజలకు న్యాయం ఆలస్యమవుతున్నట్టే. ప్రభుత్వాన్ని మభ్యపెట్టే నివేదికలు వద్దు, వాస్తవాలు నిర్భయంగా చెప్పండి. సమస్యను దాచిపెడితే అది పెద్దదవుతుంది, కానీ దానిపై బహిరంగంగా చర్చిస్తే పరిష్కారం లభిస్తుంది. సాధారణ పరిపాలన కాదు, ప్రజలు మెచ్చే సుపరిపాలన అందించాలి. ఇందుకోసం శాఖలు, జిల్లాలు, సెక్రటరీలు, కలెక్టర్లు ఒకరితో ఒకరు ఆరోగ్యకరంగా పోటీపడాలి. ‘వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్-వన్ మిషన్’… ఇదే మనందరినీ స్వర్ణాంధ్ర లక్ష్యం వైపు నడిపిస్తుంది” అని చంద్రబాబు ఉద్ఘాటించారు.






