హైదరాబాద్: తెలంగాణలో స్వయం ఉపాధి కోరుకుంటున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపికైన అర్హులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. నవంబర్ 19 నుంచి సాయం పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులకు నగదు త్వరగా అందేలా ఇప్పటి నుంచే ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ఇప్పటికే దరఖాస్తులు..
రాజీవ్ యువ వికాసం పథకానికి మార్చి 17 నుంచి ఏప్రిల్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన యువతను ఎంపిక చేసి తుది జాబితా రూపొందించారు. ఎంపికైన వారికి నవంబర్ నుంచి ఆర్థిక సాయం అందించనున్నారు.
ఎవరికి వర్తిస్తుంది?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని ఉపయోగించుకోవచ్చు. సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
అధికారులతో సమీక్ష
ప్రజాభవన్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల అమలు, గురుకులాల నిర్వహణపై చర్చించారు.
ఎంపికైన యువతకు ఆర్థిక సాయం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.






