తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం (జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనా) విచారణ జరిపింది.
తమపై నమోదైన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు చట్టపరంగా చెల్లదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారం ముమ్మాటికీ ప్రజాప్రాతినిధ్య/ఎన్నికల నిబంధనలకు సంబంధించిందని, దీనిపై దర్యాప్తు చేసే అధికారిక పరిధి ఏసీబీకి లేదని స్పష్టం చేశారు. 2015లో కేసు నమోదైన నాటికి అమల్లో ఉన్న చట్టాలను ప్రస్తావిస్తూ… నాటి నిబంధనల ప్రకారం లంచం ఇవ్వడం/తీసుకోవడం అనే ప్రక్రియను ఎన్నికల కేసుగా చూడాలి తప్ప, అవినీతి నిరోధక చట్టం కింద నేరంగా పరిగణించలేమని న్యాయవాదులు వాదించారు.
గతంలో ఈ కేసును సమగ్రంగా విచారించిన ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి పదవీ విరమణ చేయడంతో, ప్రస్తుత నూతన త్రిసభ్య ధర్మాసనం విచారణను మొదటి నుంచి చేపట్టింది. ఇరుపక్షాల ప్రాథమిక వాదనలను విన్న ధర్మాసనం, తదుపరి తుది విచారణ తేదీని త్వరలోనే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ద్వారా ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది.






