- స్టిల్ట్లో షట్టర్లు.. సెట్బ్యాక్లకు తూట్లు.. GHMC అధికారుల మౌనం ఎందుకు?
- అదనపు ఫ్లోర్ల నిర్మాణం.. గుండ్లపోచంపల్లిలో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు
- HMDA ప్లాన్ ఒకటి.. నిర్మాణం మరొకటి..? గుండ్లపోచంపల్లిలో వివాదం

TGN NEWS (మేడ్చల్) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని అధికారులు చెబుతున్నా… క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి డివిజన్ మైసమ్మాగుడలో ఓ నిర్మాణదారుడు HMDA అనుమతులను అడ్డుపెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు స్టిల్ట్ ఏరియాలో కమర్షియల్ షట్టర్లు ఏర్పాటు చేస్తూ, అవసరమైన సెట్బ్యాక్లు లేకుండానే యద్దెచ్చగ నిర్మాణం కొనసాగిస్తున్నాడు. నిర్మాణంలో కనీస సెట్బ్యాక్లు కూడా పాటించడం లేదని, దీనివల్ల భవిష్యత్తులో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలతో పాటు భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ GHMC కిందిస్థాయి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారా? లేక ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాల విషయంలో GHMC కఠినంగా వ్యవహరిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్న నేపథ్యంలో, గుండ్లపోచంపల్లి ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై GHMC అధికారులు ఎలా స్పందిస్తారు? ప్రజల అనుమానాలకు సమాధానం చెబుతారా? అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా? అనేది వేచి చూడాల్సి ఉంది.






