మహబూబ్నగర్ జిల్లా జైలులో సంచలన ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసులో రిమాండ్లో ఉన్న నిందితుడు కిషోర్ జైలు నుంచి పరారయ్యాడు. టవల్స్ను కలిపి తాడులా తయారు చేసుకుని, వాటి సహాయంతో జైలు గోడ దూకి తప్పించుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
అమరచింత పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో కిషోర్ నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల అతడిని రిమాండ్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించారు. సోమవారం ఉదయం జైలు సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కిషోర్ తన సెల్లో కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వెంటనే జైలు అధికారులు అప్రమత్తమై జైలు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పరారైన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు కిషోర్ ఆచూకీ లభించలేదు.
టవల్స్తో తాడు తయారు చేసి జైలు గోడ దూకి పరారవడం ఎలా సాధ్యమైందనే అంశంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. జైలు భద్రతలో నిర్లక్ష్యం లేదా లోపాలు ఉన్నాయా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రేపింది. జిల్లా జైలు భద్రతా వ్యవస్థపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరారైన నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.