ఏపీ ఓటర్లకు కీలక సూచన.. మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందా? వెంటనే ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ముగియడంతో లక్షలాది మంది ఓటర్ల దృష్టి ఇప్పుడు తుది జాబితాపై పడింది. ఈ ప్రక్రియలో అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేని ఓటర్ల పేర్లను తొలగించే చర్యలు చేపట్టినట్లు సమాచారం. వేరే చిరునామాకు మారడం, మరణించడం, ఒకటి కంటే ఎక్కువ ఓటర్ ఐడీలు కలిగి ఉండటం లేదా ధృవీకరణ సమయంలో అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో దాదాపు 44.71 లక్షల పేర్లు తొలగింపు జాబితాలో ఉన్నట్లు సమాచారం. జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో వీరి పేర్లు లేకపోవచ్చు.
పేరు లేకపోతే ఏం చేయాలి?
ఒకవేళ మీ పేరు ఓటర్ల జాబితాలో కనిపించకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆగస్టు 30లోపు ఫారం-6 ద్వారా కొత్తగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ఇలా ఉంటుంది:
- ఫారం-6ను ఆన్లైన్ లేదా ఎన్నికల అధికారుల ద్వారా పొందాలి.
- అవసరమైన వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
- గుర్తింపు, చిరునామా ధృవీకరణ పత్రాలు జతచేయాలి.
- అధికారులు పరిశీలన అనంతరం అర్హత ఉంటే మీ పేరును ఓటర్ల జాబితాలో చేర్చి కొత్త ఓటర్ ఐడీ జారీ చేస్తారు.
మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?
ఎస్ఐఆర్ ప్రక్రియలో మీ పేరు నమోదైందో లేదో ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
- మొబైల్లో ECI అని టైప్ చేయండి.
- స్పేస్ ఇచ్చి మీ ఓటర్ ఐడీ నంబర్ నమోదు చేయండి.
- ఆ సందేశాన్ని 1950 నంబర్కు పంపండి.
- తిరిగి వచ్చే సందేశంలో అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్, పేరు వంటి వివరాలు కనిపిస్తే మీ పేరు నమోదైనట్లే.
- వివరాలు రాకపోతే వెంటనే బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) లేదా ఎన్నికల అధికారులను సంప్రదించడం మంచిది.
బీఎల్వోలు ఇచ్చిన ఫారాలు తప్పనిసరిగా సమర్పించాలి
ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. వాటిని పూర్తి చేసి తిరిగి సమర్పించని వారి పేర్లు తొలగించే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మళ్లీ ఫారం-6 ద్వారా కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఓటర్లు చేయాల్సిందేమిటి?
జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాను తప్పనిసరిగా పరిశీలించండి. మీ పేరు లేకపోతే నిర్ణీత గడువులోపు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసి మీ ఓటు హక్కును కాపాడుకోండి.





