తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు అందించే బోధన ఫీజులు, స్కాలర్షిప్ల విధానంలో సంచలన మార్పులు చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానం ద్వారా విద్యార్థులకు మరింత సౌలభ్యం కలగనుంది.
ఇకపై ఈ-పాస్ పోర్టల్ ఏడాది పొడవునా అందుబాటులో ఉండనుంది. విద్యార్థులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ముందుగా దరఖాస్తు చేసిన వారికి ముందుగా నిధులు విడుదల చేయనున్నారు.
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటూ మొత్తం ట్యూషన్ ఫీజును ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ కానుంది. డబ్బు జమ అయిన వారం రోజుల్లోపు కళాశాలలకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆటోమేటిక్ రెన్యువల్ సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో నివసిస్తూ కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల్లోపు ఉన్న విద్యార్థులు ఈ పథకం ప్రయోజనాలు పొందవచ్చు.
