Home జాతీయం పరిహారం.. పరిహాసం! ఎలివేటెడ్‌ కారిడార్‌ భూసేకరణపై భూబాధితుల ఆగ్రహం

పరిహారం.. పరిహాసం! ఎలివేటెడ్‌ కారిడార్‌ భూసేకరణపై భూబాధితుల ఆగ్రహం

0

హైదరాబాద్‌: నగరం నుంచి రాజీవ్‌ రహదారి మార్గంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక ఎలివేటెడ్‌ కారిడార్‌ భూసేకరణ ప్రక్రియపై భూబాధితుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ మార్కెట్‌ ధరలు, ఎస్‌ఆర్‌ఓ రేట్లను పరిగణనలోకి తీసుకోకుండా పరిహారం నిర్ణయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ప్రాంతాన్ని బట్టి భూముల ధరల్లో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ పరిహారం విషయంలో సరైన ప్రామాణికత పాటించడం లేదని రాజీవ్‌ రహదారి జేఏసీ పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల భూములు, ఆస్తులు కోల్పోతున్న బాధితులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రాంతానికో రకంగా పరిహారం

జేబీఎస్‌ నుంచి తిరుమలగిరి ఎక్స్‌ రోడ్డు వరకు ఎస్‌ఆర్‌ఓ విలువ గజానికి రూ.50 వేలుగా ఉన్నప్పటికీ ప్రభుత్వం రూ.1.40 లక్షల పరిహారం ప్రతిపాదించినట్లు బాధితులు చెబుతున్నారు. తిరుమలగిరి నుంచి లోతుకుంట వరకు ఎస్‌ఆర్‌ఓ విలువ రూ.37 వేలు ఉండగా రూ.90 వేల పరిహారం, లోతుకుంట నుంచి అల్వాల్‌ వరకు రూ.27 వేల ఎస్‌ఆర్‌ఓ ధరకు రూ.1.10 లక్షల పరిహారం ప్రతిపాదించారని తెలిపారు.

అల్వాల్‌ నుంచి తూంకుంట వరకు ఎస్‌ఆర్‌ఓ విలువ సుమారు రూ.10 వేలుగా ఉన్నప్పటికీ గజానికి రూ.1.10 లక్షల పరిహారం ఇస్తున్నారని పేర్కొన్నారు.

మార్కెట్‌ ధరలను పట్టించుకోవడం లేదని ఆరోపణ

ఎస్‌ఆర్‌ఓ రేట్లతో పాటు బహిరంగ మార్కెట్‌ ధరలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని భూబాధితులు ఆరోపిస్తున్నారు. విక్రమ్‌పురి, తిరుమలగిరి వంటి వాణిజ్య ప్రాంతాల సమీపంలో మార్కెట్‌ ధరలు గజానికి రూ.5 లక్షలు దాటుతున్నా, పరిహారం మాత్రం అందుకు అనుగుణంగా లేదని అంటున్నారు.

ప్రాంతీయ పరిస్థితులు, వాణిజ్య ప్రాధాన్యత, భూముల వాస్తవ మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుని పరిహారం నిర్ణయించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

భూసేకరణకు అడ్డంకులు

ప్రభుత్వం ప్రతిపాదించిన పరిహారం తమకు న్యాయం చేయడం లేదని భావిస్తున్న బాధితులు భూములు ఇవ్వడానికి వెనుకాడుతున్నారని జేఏసీ నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా అల్వాల్‌, తూంకుంట ప్రాంతాల్లో ప్రస్తుత మార్కెట్‌ ధరలను దృష్టిలో ఉంచుకుని కనీస పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నిర్ణయించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నగదు పరిహారమే కావాలంటున్న బాధితులు

ప్రభుత్వం పూర్తి పరిహారాన్ని నగదు రూపంలోనే చెల్లించాలని, టీడీఆర్‌ (TDR) వంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను అంగీకరించబోమని రాజీవ్‌ రహదారి జేఏసీ చైర్మన్‌ తేలుకుంట సతీష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. పరిహారంపై స్పష్టత వచ్చే వరకు భూసేకరణకు సహకరించేది లేదని తెలిపారు.

భూముల మార్కెట్‌ విలువ, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని న్యాయమైన పరిహారం నిర్ణయించిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version