హైదరాబాద్లో విషాదం.. బెంగళూరు నుంచి వారం క్రితమే వచ్చిన పీజీ మెడికో విద్యార్థిని మృతి
హైదరాబాద్ నగరంలోని కీసర పోలీస్స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో పీజీ మెడికల్ విద్య అభ్యసిస్తున్న ఓ యువతి అపార్ట్మెంట్పై నుంచి దూకి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని నాగారం ఈస్ట్ గాంధీనగర్కు చెందిన దీక్షిత (26) ఎంబీబీఎస్ పూర్తి చేసి, బెంగళూరులోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతోంది. గత వారం ఆమె బెంగళూరు నుంచి తల్లిదండ్రులను కలిసేందుకు నాగారంలోని ఇంటికి వచ్చింది.
శుక్రవారం సాయంత్రం ఆమె అపార్ట్మెంట్పై నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
దీక్షిత కుటుంబం స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామమని, ప్రస్తుతం నాగారంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి ఆనంద్ కుమార్ ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటనతో నాగారం ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.