
జూలై 11, 2026న ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక యాత్ర 11 రోజుల పాటు కొనసాగి జూలై 21న ముగుస్తుంది. ఆధ్యాత్మికత, చరిత్ర, భారతీయ సంస్కృతి కలయికగా రూపొందించిన ఈ టూర్ భక్తులకు మరపురాని అనుభూతిని అందించనుంది.
యాత్రలో సందర్శించే ప్రధాన పుణ్యక్షేత్రాలు
ఈ టూర్లో భాగంగా భక్తులు ద్వారకలోని ప్రసిద్ధ ద్వారకాధీశ్ ఆలయంతో పాటు బేట్ ద్వారక, నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించనున్నారు. అనంతరం సోమనాథ్ జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని భీమాశంకర్, నాసిక్లోని త్రయంబకేశ్వర్, ఛత్రపతి సంభాజీనగర్ సమీపంలోని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను సందర్శిస్తారు. అలాగే యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎల్లోరా గుహలను కూడా వీక్షించే అవకాశం కల్పించారు.
ఎక్కడి నుంచి ప్రయాణం?
ఈ ప్రత్యేక రైలు మధ్యప్రదేశ్లోని రేవా నుంచి ప్రారంభమవుతుంది. సత్నా, మైహర్, కట్ని, జబల్పూర్, నార్సింగ్పూర్, ఇటార్సీ, రాణి కమలపతి, షుజల్పూర్, ఉజ్జయిని తదితర స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కవచ్చు. తిరుగు ప్రయాణంలో ఖాండ్వా, ఇటార్సీ, జబల్పూర్, కట్ని, సత్నా, రేవా స్టేషన్లలో దిగే అవకాశం ఉంటుంది.
ప్యాకేజీ ధరలు
- స్లీపర్ క్లాస్: రూ.20,250
- 3AC: రూ.33,250
- 2AC: రూ.44,000
ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం, వసతి, భోజనం, స్థానిక రవాణా, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు చేర్చబడ్డాయి.
ప్రయాణికులకు ప్రత్యేక సదుపాయాలు
యాత్రికులకు ప్రతిరోజూ టీ లేదా కాఫీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందించనున్నారు. అదనంగా రోజుకు ఒక లీటర్ రైల్నీర్ వాటర్ బాటిల్, స్థానిక దర్శనాల కోసం బస్సు సౌకర్యం, టూర్ ఎస్కార్ట్లు, భద్రతా సిబ్బంది సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
అయితే ప్రత్యేక దర్శన టిక్కెట్లు, స్మారక చిహ్నాల ప్రవేశ రుసుములు, వ్యక్తిగత ఖర్చులు, లాండ్రీ, మందులు తదితర ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
ఆధ్యాత్మిక యాత్రతో పాటు భారతీయ సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని ఆస్వాదించాలనుకునే భక్తులకు ఈ IRCTC ప్రత్యేక టూర్ ఒక అద్భుతమైన అవకాశంగా నిలవనుంది.