హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ భూముల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఫార్మాసిటీని రద్దు చేసి భూములను రైతులకు తిరిగి ఇస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఇప్పుడు రైతులకు “ఇంచు భూమి కూడా వెనక్కి ఇవ్వడం లేదని” ఆరోపించారు.
ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ పేరుతో భారీ స్థాయిలో భూములను సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఫార్మాసిటీ కోసం మాత్రమే భూసేకరణ జరిగిందని, ఆ భూములను ఇతర అవసరాలకు వినియోగించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “అమెరికాను మించిన నగరం నిర్మిస్తామని చెబుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఫ్యూచర్కే దిక్కు లేదు” అంటూ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టే వారు చట్టపరమైన అంశాలను పరిశీలించకుండా ముందుకు వెళ్లవద్దని కేటీఆర్ సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పెట్టుబడిదారులే నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
