దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్, నటుడు రానా దగ్గుబాటి మధ్య ఉన్న స్నేహంపై గతంలో ఎన్నో ప్రచారాలు జరిగాయి. తాజాగా త్రిష పాత ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తనకు, రానాకు దాదాపు 18 ఏళ్ల వయసు నుంచే పరిచయం ఉందని త్రిష తెలిపారు. అప్పట్లో తాను చెన్నైలోని టీ నగర్లో నివసించేదాన్నని, ఎదురుగా ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు కుటుంబం ఇల్లు ఉండేదని గుర్తు చేసుకున్నారు. రానా కూడా తన బాల్యంలో కొంతకాలం చెన్నైలోనే గడిపాడని, ఆ పరిచయమే తర్వాత స్నేహంగా మారిందని చెప్పారు.
తమ బంధాన్ని వివరిస్తూ త్రిష, “మా కథకు ముగింపు ఉండదు” అని పేర్కొన్నారు. కొన్నిసార్లు చాలా మంచి స్నేహితులుగా ఉంటామని, మరికొన్ని సందర్భాల్లో అసలు మాట్లాడుకోమని తెలిపారు. తమది ఒకరకంగా “లవ్-హేట్ రిలేషన్షిప్” లాంటిదని, ఎన్ని పరిస్థితులు వచ్చినా పూర్తిగా ఒకరినొకరు దూరం చేసుకోలేని అనుబంధమని చెప్పారు.
రానాను చాలామంది “లేడీస్ మ్యాన్” అని పిలవడంపై కూడా త్రిష స్పందించారు. అవును, అతను లేడీస్ మ్యాన్ అని, అందులో సందేహం లేదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అయితే రానాలో తనకు అత్యంత నచ్చే లక్షణం అతని వ్యక్తిత్వమని వివరించారు.
పెద్ద సినీ కుటుంబానికి చెందినప్పటికీ రానా ఎప్పుడూ గర్వంగా ప్రవర్తించడని, అందరితో మర్యాదగా, గౌరవంగా ఉంటాడని త్రిష ప్రశంసించారు. తమ మధ్య విభేదాలు వచ్చినా, మాట్లాడుకోని సందర్భాలు ఉన్నా ఇతరుల పట్ల అతని గౌరవభావం ఎప్పుడూ మారదని తెలిపారు. రానా నిజమైన జెంటిల్మన్ అని కూడా ఆమె పేర్కొన్నారు.
తన సినీ కెరీర్ ప్రారంభ దశలో వర్షం సినిమా ఫోటోషూట్ సమయంలోనే రానాను తొలిసారి కలిశానని త్రిష గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తమ స్నేహం ఎన్నో దశలు దాటినా, పూర్తిగా ముగిసిన సందర్భం ఎప్పుడూ లేదని చెప్పారు.