TGN NEWS (జహీరాబాద్): భారతదేశంలో పుట్టడం మన అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరూ మాతృ భూమిని ప్రేమించాలని సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ శతాబ్ది ఉత్సవాల భాగంగా గ్రామంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారతమాత, డాక్టర్ హేడ్గేవార్, గురుజీ చిత్రపటాలతో పాటు కాషాయ ధ్వజం చేత పట్టుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించిందని అన్నారు.

- ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు
స్వామి వివేకానంద, బాల గంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. హిందూ సమాజంలో సౌశీల్యాన్ని పెంపొందించి జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించడం హేడ్గేవార్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో లక్షకు పైగా శాఖలు నిర్వహిస్తూ, తన భావజాలాన్ని దేశ వ్యాప్తంగా విస్తరింపజేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గ్రామంలో నిర్వహించిన ర్యాలీ పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్ధేశ్వరానందగిరి మహారాజ్, భక్తులు పాల్గొన్నారు.