Home తెలంగాణ హైడ్రా కమిషనర్‌ను తప్పించాలన్న హైకోర్టు.. ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి

హైడ్రా కమిషనర్‌ను తప్పించాలన్న హైకోర్టు.. ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి

0

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తక్షణం విధుల నుంచి తప్పించాలంటూ హైకోర్టు వెలువరించిన ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ ఉత్తర్వులను సమీక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని, ఆ సంస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రా అనేది తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అతిపెద్ద సంస్కరణ అని అభివర్ణించారు. ఆక్రమణదారులు నకిలీ పత్రాలతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తూ, సోషల్ మీడియా వేదికగా ఏజెన్సీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

“బతుకమ్మ కుంటను ఆక్రమించింది పేదలా లేక పెద్దలా? ఒక బీఆర్ఎస్ నేత అక్కడ 10 ఎకరాలు కబ్జా చేశారు. ఎన్ కన్వెన్షన్ పేదలదా? గండిపేట చెరువు వద్ద కూల్చివేసినవి సామాన్యుల నిర్మాణాలా?” అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భూ కబ్జాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

కబ్జాదారులను రక్షించేందుకు భారీగా నిధులు వెచ్చిస్తూ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్ కుమార్‌పై 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హైడ్రా విషయంలో ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, ఒక అధికారిని ఎక్కడ నియమించాలన్నది ప్రభుత్వ విచక్షణాధికారమని ఆయన పేర్కొన్నారు. తప్పుడు కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version