Home తెలంగాణ నౌకా మైన్లు ఢీకొని పేలిపోయిన ఆయిల్ ట్యాంకర్

నౌకా మైన్లు ఢీకొని పేలిపోయిన ఆయిల్ ట్యాంకర్

7
0

హర్మూజ్ జలసంధిలో ఓ భారీ ఆయిల్ ట్యాంకర్ నౌకా మైన్లను ఢీకొని పేలిపోయినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నేవీ మంగళవారం ప్రకటించింది. ‘ఎల్ గియా’ అనే ఈ సూప‌ర్ ఆయిల్ ట్యాంకర్, తాము నిషేధించిన మార్గంలో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది.

ఐఆర్‌జీసీ అధికారిక మీడియా సంస్థ సెపా న్యూస్ కథనం ప్రకారం.. మైన్లను ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్‌లో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. నౌక మొత్తం మంటల్లో చిక్కుకుందని, వాటిని అదుపు చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపింది. ఈ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలో ఉందని, చట్టవిరుద్ధమైన మార్గంలో ప్రయాణిస్తే ఎదురయ్యే ప్రమాదాల గురించి తాము ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది.

ఇటీవల, ఇరాన్‌కు చెందిన పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ (పీజీఎస్ఏ) కూడా నిబంధనలు ఉల్లంఘిస్తున్న నౌకలకు బీమా వంటి సేవలు అందించవద్దని సంబంధిత కంపెనీలను హెచ్చరించింది. కొన్ని రోజుల క్రితం ఇదే జలసంధిలో అమెరికాకు చెందిన ఓ మానవరహిత సర్ఫేస్ వెహికల్‌ను (యూఎస్‌వీ) తమ దళాలు ధ్వంసం చేశాయని ఐఆర్‌జీసీ ప్రకటించడం గమనార్హం.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత టెహ్రాన్ ఈ జలసంధి గుండా రాకపోకలను నియంత్రించింది. దీనికి ప్రతిగా, ఇరాన్ ఓడరేవులకు వెళ్లే నౌకలపై అమెరికా దళాలు నౌకా దిగ్బంధనం విధించాయి. హర్మూజ్ జలసంధిలో ఎలాంటి శత్రు కార్యకలాపాలను సహించబోమని ఐఆర్‌జీసీ మరోసారి గట్టిగా హెచ్చరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here