రాజకీయాలపై ఫుల్స్టాప్.. జనసేన ప్రచారాన్ని ఖండించిన ఏవీ రంగనాథ్
హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి స్వయంగా తెరదించారు. జనసేన పార్టీలో చేరడం కానీ, ఎన్నికల్లో పోటీ చేయడం కానీ తన ఆలోచనల్లో లేదని స్పష్టం చేశారు.
ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చిరంజీవి కుటుంబంతో తనకు సుదీర్ఘకాలంగా వ్యక్తిగత పరిచయం ఉందని, పవన్ కల్యాణ్తో కూడా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అయితే వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేయడం సరైంది కాదన్నారు.
పవన్ కల్యాణ్ భూమి వివాదంపై స్పందించిన రంగనాథ్, ఆ భూమి కొనుగోలు జరిగిన తర్వాతే చెరువు నోటిఫికేషన్లు వెలువడ్డాయని వివరించారు. భూమి సహజ స్వరూపాన్ని మార్చడం, చెరువును ఆక్రమించడం లేదా నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం జరగలేదని స్పష్టం చేశారు.
అయితే FTL పరిధిలో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ మాత్రం నిబంధనలకు విరుద్ధమని, అందుకే దానిని తొలగించాలని సూచించినట్లు చెప్పారు. అన్ని కేసుల్లో చట్టప్రకారమే చర్యలు తీసుకుంటామని, ఎవరిపైనా ప్రత్యేక వైఖరి ఉండదని స్పష్టం చేశారు.
మరోవైపు, కోర్టు ధిక్కరణ కేసుల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, పరిపాలనాపరంగా చర్చనీయాంశమయ్యాయి. హైడ్రా కమిషనర్పై తీసుకున్న చర్యల విషయంలో ప్రభుత్వం తదుపరి న్యాయపరమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది.






