హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగర శివారులోని గాజులరామారంలో 100 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక బస్ టెర్మినల్ నిర్మాణానికి భూమి కేటాయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
లోక్సభలో ఎంపీలు చామల కిరణ్కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన గడ్కరీ.. గతంలో జగద్గిరిగుట్ట సమీపంలోని హెచ్ఎంటీ భూమిని 99 ఏళ్ల లీజుకు టీజీఎస్ఆర్టీసీ కోరిందని తెలిపారు. అయితే హెచ్ఎంటీ 20 ఏళ్ల లీజు మాత్రమే ఇవ్వగలమని, ప్రతి ఐదేళ్లకోసారి సమీక్షతో పాటు ఏటా రూ.6 కోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించాలని షరతు విధించడంతో ఆ ప్రతిపాదనను టీజీఎస్ఆర్టీసీ తిరస్కరించిందన్నారు.
దీంతో తెలంగాణ ప్రభుత్వం గాజులరామారంలో హెచ్ఎంటీ భూములకు సమీపంగా 100 ఎకరాల స్థలాన్ని టీజీఎస్ఆర్టీసీకి కేటాయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జగద్గిరిగుట్ట మార్గంలో 28 జిల్లా బస్సులు, 47 సిటీ బస్సులు రోజుకు 404 ట్రిప్పులు నిర్వహిస్తున్నాయని, కొత్త డిపోతో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని పేర్కొన్నారు.
ఈ మెగా టెర్మినల్లో ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్, సిటీ బస్ టెర్మినల్, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల బస్సులు నగరంలోకి పూర్తిగా ప్రవేశించకుండా గాజులరామారం నుంచే సర్వీసులు నడిచే అవకాశం ఉండటంతో ఎంజీబీఎస్, జేబీఎస్లపై ఒత్తిడి తగ్గి ట్రాఫిక్ సమస్యకు ఉపశమనం లభించనుంది.