ఆంధ్రప్రదేశ్కు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బుధవారం సియోల్ నుంచి దక్షిణ కొరియా వాణిజ్య కేంద్రం బుసాన్కు రైలులో ప్రయాణించారు. బుసాన్లో పలు కీలక సమావేశాలు, కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్టర్నల్ ఎంగేజ్మెంట్–కొరియా (APEDB Korea) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘APEX–Korea’ కేంద్రాన్ని మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు ఈ కేంద్రం సహాయక వేదికగా పనిచేయనుంది.
అనంతరం కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ (KOMEA) నిర్వహించే రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొని, రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాలపై కొరియా ప్రతినిధులకు వివరించనున్నారు.
పర్యటనలో భాగంగా బీఎన్కే ఫైనాన్షియల్, బూయాంగ్ గ్రూప్, హ్యుంగ్ సాంగ్ గ్రూప్ తదితర ప్రముఖ సంస్థల ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్య అవకాశాలపై చర్చించనున్నారు.
అదే రోజు సాయంత్రం బుసాన్లోని ప్రముఖ షూఆల్స్ ఫుట్వేర్ తయారీ కేంద్రాన్ని మంత్రి సందర్శించనున్నారు. అన్ని కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాత్రికి బుసాన్ నుంచి తిరిగి సియోల్కు చేరుకోనున్నారు.




