తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. దేశంలో ప్రతిపాదించిన ఏడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల్లో మూడు రూట్లు తెలంగాణ మీదుగా వెళ్లనున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే హైదరాబాద్ దేశంలోని ప్రధాన నగరాలతో మరింత వేగంగా అనుసంధానం కానుంది.
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, బుల్లెట్ ట్రైన్ ద్వారా హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం గంటా 10 నిమిషాలు, ముంబైకి 2 గంటల 20 నిమిషాలు, చెన్నైకి 2 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ హైస్పీడ్ రైలు నెట్వర్క్ తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో ఈ ప్రాజెక్టులపై రాజకీయంగా క్రెడిట్ తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించిన అశ్వినీ వైష్ణవ్, ఈ ప్రాజెక్టుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వమే కారణమని అన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే తెలంగాణకు రైల్వే రంగంలో భారీగా నిధులు కేటాయించామని, వాటి ఫలితంగానే రాష్ట్రంలో అనేక రైల్వే ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.





