తెలంగాణలో ఓ ప్రభుత్వ ఇంజినీర్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ శాఖలో ఉద్యోగిగా కొనసాగుతూనే.. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా దాదాపు 20 ఏళ్లుగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
సమాచారం ప్రకారం.. ఆర్అండ్బీ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఉన్న సీహెచ్ రవి 2006లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న సమయంలో అమెరికా వెళ్లారు. 2011లో కొంతకాలం భారత్కు తిరిగి వచ్చిన ఆయన.. 2012లో మళ్లీ అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి ప్రభుత్వ విధులకు హాజరుకాలేదని అధికారులు గుర్తించారు.
ఆయనకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వ వేతనం చెల్లించకపోయినప్పటికీ.. ఆర్అండ్బీ శాఖ రికార్డుల్లో మాత్రం ఉద్యోగిగానే కొనసాగుతున్నట్లు సమాచారం.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగులు విదేశాల్లో ఉద్యోగం చేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక సెలవులకు కూడా నిబంధనలు వర్తిస్తాయి. అయితే రవి ఎలాంటి అనుమతి లేకుండా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
అనధికారికంగా విధులకు గైర్హాజరైనట్లు, సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరగనుంది. ఈ ఆరోపణలపై సదరు ఇంజినీర్ నుంచి ఇప్పటివరకు లిఖితపూర్వక వివరణ రాలేదని తెలుస్తోంది. విచారణలో వెలువడే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది.






