విదేశీ పౌరులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్న కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్ నిమార్ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
విదేశీయులను పన్ను బకాయిలు, రుణ బకాయిలు, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ప్రమేయం వంటి కారణాలతో బెదిరించి.. తన ముఠాతో కలిసి మోసాలకు పాల్పడుతున్నట్లు వికాస్ నిమార్పై ఆరోపణలు ఉన్నాయి.
మూడు నగరాల్లో ఏకకాలంలో సోదాలు
ఈ తరహా మోసాలకు సంబంధించి కొన్ని నెలల క్రితం సీబీఐ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆ కేసు ఆధారంగా దర్యాప్తులోకి దిగిన ఈడీ అధికారులు హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
సోదాల అనంతరం వికాస్ నిమార్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకుని సాగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మోసాల వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు, నిందితుల నెట్వర్క్, అక్రమంగా సంపాదించిన ఆస్తులపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.






