విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్ పనితీరులో కొత్త రికార్డు సృష్టించింది. వార్షికంగా రూ.2,493 కోట్ల ఆదాయాన్ని సాధించి దేశంలోని అత్యుత్తమ రైల్వే జోన్గా నిలిచిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ఎత్తున పెట్టుబడులు కొనసాగుతున్నాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రూ.54 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు అమల్లో ఉండగా, మరో రూ.71 వేల కోట్ల ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నట్లు పేర్కొంది.
విశాఖ రైల్వే యార్డ్ ఆధునికీకరణకు రూ.300 కోట్లు కేటాయించినట్లు వెల్లడించిన కేంద్రం, ఆరు కొత్త ప్లాట్ఫామ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. గుంతకల్–బళ్లారి మధ్య నాలుగు లైన్ల విస్తరణ కోసం రూ.1,205 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వివరించింది.
రైళ్ల భద్రతను పెంచే లక్ష్యంతో 100 లోకోమోటివ్లలో ‘కవచ్’ భద్రతా వ్యవస్థను అమలు చేసినట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 300కు పైగా ROBలు, RUBలు నిర్మాణంలో ఉండగా, అమృత్ భారత్ పథకం కింద 70కి పైగా స్టేషన్లు ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంది. విజయవాడ రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు, రాబోయే గోదావరి పుష్కరాలకు ప్రత్యేక రైల్వే ఏర్పాట్లు కూడా చేపడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది.






