సాధారణంగా ఉపాధి హామీ పనులు అంటే కష్టపడి పని చేసే కూలీల దృశ్యాలే గుర్తుకు వస్తాయి. కానీ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నయిపల్లి గ్రామంలో మాత్రం అందుకు భిన్నమైన, హృదయాలను హత్తుకునే ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది.
గ్రామంలోని ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న ఓ వృద్ధ దంపతులు పని విరామ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించారు. వారిని చూసిన తోటి కూలీలకు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. వెంటనే అడవిలో దొరికే ఆకులు, పూలను సేకరించి అక్షింతలుగా మార్చారు. ఆ తర్వాత వృద్ధ దంపతులను పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిలా కూర్చోబెట్టి సరదాగా పెళ్లి వేడుకను నిర్వహించారు.
పనికి ఉపయోగించే గంపలను బ్యాండ్ మేళాల్లా మోగిస్తూ, ఆకులు, పూలతో అక్షింతలు చల్లుతూ పెళ్లి వాతావరణాన్ని సృష్టించారు. అక్కడున్న కూలీలంతా నవ్వులు పూయిస్తూ, చప్పట్లతో వృద్ధ దంపతులను ఆశీర్వదించారు.
ఈ అపురూపమైన దృశ్యం అక్కడున్న వారందరికీ ఆనందాన్ని పంచింది. రోజువారీ కష్టాల మధ్య కాసేపు నవ్వులు, సంతోషాలను పంచుకున్న ఈ సరదా వేడుక గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మానవ సంబంధాల్లోని ఆప్యాయత, అనుబంధాలకు ఈ సంఘటన ఓ చక్కని ఉదాహరణగా మారింది.



