జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడటంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
మంగళవారం జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీపంలోని యూ-టర్న్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం.. ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి చెందినవారు. ఉపాధి కోసం జహీరాబాద్ పరిసర ప్రాంతాలకు కూలి పనులకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం అంత తీవ్రంగా ఉండటంతో ఆటోలోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. అక్కడ వారికి వైద్య చికిత్స కొనసాగుతోంది.
ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ట్యాంకర్ వేగం, యూ-టర్న్ వద్ద జరిగిన పరిణామాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి రానున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
జహీరాబాద్ రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురి మృతికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ ఘటనతో సత్వార్ గ్రామం పరిసర ప్రాంతాల్లో విషాద వాతావరణం నెలకొంది. మృతులు కర్ణాటకకు చెందినవారు కావడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
