హైదరాబాద్లో ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం మహిళా హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహాల్లో ఉంటున్న మహిళలు, విద్యార్థినుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు నగర పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC), యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సహకారంతో ‘ప్రాజెక్ట్ సేఫ్ స్టే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ‘సురక్ష నివాస్ 1.0’ మార్గదర్శకాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మరియు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆవిష్కరించారు.
పోలీస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
సీపీ వీసీ సజ్జనర్ తెలిపిన వివరాల ప్రకారం, ఇకపై నగరంలోని ప్రతి మహిళా హాస్టల్, పీజీ నిర్వాహకుడు స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం ఫామ్-A సమర్పించాల్సి ఉంటుంది. భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు త్వరలో ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
సర్వేలో బయటపడిన కీలక అంశాలు
హైదరాబాద్లోని 447 మహిళా హాస్టళ్లపై నిర్వహించిన ప్రత్యేక సర్వేలో:
- 97.5% హాస్టళ్లలో సీసీటీవీలు ఉన్నాయి
- 43% హాస్టళ్లకు మాత్రమే సరైన కాంపౌండ్ వాల్ ఉంది
- 38.9% హాస్టళ్లలో మాత్రమే అగ్నిమాపక పరికరాలు ఉన్నాయి
ఈ లోపాలను దృష్టిలో ఉంచుకుని కొత్త భద్రతా మార్గదర్శకాలు రూపొందించారు.
జీహెచ్ఎంసీ, ఫైర్, ఫుడ్ సేఫ్టీ సూచనలు
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ ప్రతి హాస్టల్కు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి అని తెలిపారు. భోజనం అందించే హాస్టళ్లు FSSAI లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
ఫైర్ అధికారులు ప్రతి భవనంలో అత్యవసర నిష్క్రమణ మెట్లు, ఫైర్ ఎక్స్టింగిషర్లు, హోస్ రీల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు నాసిరకం ఆహారం, పరిశుభ్రత లోపాలు, నిబంధనల ఉల్లంఘనలపై క్రిమినల్ కేసులు, భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
అధికారుల ప్రకారం, మహిళలు సురక్షితంగా నివసించే వాతావరణాన్ని కల్పించడమే ‘ప్రాజెక్ట్ సేఫ్ స్టే’ ప్రధాన లక్ష్యం.






