అమరావతి: ఆంధ్రప్రదేశ్ను అత్యాధునిక సాంకేతికతల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు పడింది. ఐబీఎం భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరావతి క్వాంటం అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ (AQAIC) గురువారం ప్రారంభమైంది.
ఈ కేంద్రం ద్వారా భారతదేశంలోనే అతిపెద్ద క్వాంటం సమస్య-పరిష్కార సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పరిశ్రమల అవసరాలు, విద్యా సంస్థల పరిశోధనా ప్రతిభ, ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశం.
తయారీ, లాజిస్టిక్స్, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు, ఇంధన రంగం, వ్యవసాయం, ప్రజా సేవలు వంటి కీలక రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు ఆధారిత పరిష్కారాల అభివృద్ధికి ఈ కేంద్రం మద్దతు అందించనుంది.
అంతేకాకుండా, యువతకు అధునాతన సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ, పరిశోధన అవకాశాలు కల్పించడం ద్వారా ప్రపంచ స్థాయి టెక్నాలజీ నిపుణులను తయారు చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. దీంతో అమరావతి దేశంలోనే ప్రముఖ డీప్-టెక్ ఇన్నోవేషన్ హబ్గా ఎదిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
