Home తెలంగాణ స్కైరూట్ విజయాన్ని కొనియాడుతూ.. రాహుల్‌పై ప్రధాని మోదీ పరోక్ష వ్యాఖ్యలు

స్కైరూట్ విజయాన్ని కొనియాడుతూ.. రాహుల్‌పై ప్రధాని మోదీ పరోక్ష వ్యాఖ్యలు

0

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం సాధించిన తాజా అంతరిక్ష విజయాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ విజయాన్ని అభినందించిన ఆయన, ఆ సంస్థ యువ బృందాన్ని ప్రశంసించారు.

సోమవారం పార్లమెంట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ, “భారత్ నుంచి తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్ బృందం సగటు వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. దేశ యువత తమ ప్రతిభతో ప్రపంచానికి భారత సామర్థ్యాన్ని చాటుతోంది. నేను ఇక్కడ 56 ఏళ్ల ‘యువకుడి’ గురించి మాట్లాడటం లేదు.. రోదసిలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన 28 ఏళ్ల యువత గురించి మాట్లాడుతున్నాను” అని వ్యాఖ్యానించారు.

ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇటీవల 56వ ఏట అడుగుపెట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ఇటీవల ‘విక్రమ్-1’ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ విజయంతో ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగ సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో భారత్ కీలక స్థానం సంపాదించింది. భారత యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు సాధించిన ఈ ఘనత దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ కొనియాడారు.

అంతేకాకుండా, గత ఏడాది వర్షాకాల సమావేశాలకు ముందు ఓ భారతీయుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరిన ఘట్టాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. ఈసారి పార్లమెంట్ సమావేశాలు ప్రజా సమస్యలపై సార్థకమైన చర్చలకు వేదిక కావాలని, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఫలప్రదంగా సాగాలని ప్రధాని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version