పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న లక్ష్మీదేవిపల్లి బ్యాలన్సింగ్ రిజర్వాయర్ కోసం భూసేకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
సయ్యద్పల్లి పరిసర ప్రాంతాల్లోని భూములను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి భూసేకరణ, సర్వే పనులు, ముంపు ప్రాంతాల గుర్తింపు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
అధికారుల అంచనా ప్రకారం రిజర్వాయర్ నిర్మాణానికి సుమారు 2,919 ఎకరాల భూమి అవసరం కానుంది. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాయి.
2.80 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించనున్న ఈ రిజర్వాయర్, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో కీలక భాగంగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తెలంగాణలో సుమారు 4.97 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభించనుంది.
రిజర్వాయర్ నిర్మాణంతో పరిగి, వికారాబాద్, తాండూరు ప్రాంత రైతుల భూములు సస్యశ్యామలం అవుతాయని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.