అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు.
ఈ సర్వే ద్వారా డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి పేర్లు, చిరునామా మార్పులు వంటి అంశాలను గుర్తించి సవరణలు చేపడతారు. జూలై 31న ముసాయిదా జాబితా విడుదల కానుండగా, తుది జాబితా అక్టోబర్ 1న ప్రకటించనున్నారు.
ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక దృష్టి సారించాయి. తమ పార్టీకి అనుకూల ఓట్లు తొలగిపోకుండా చూసుకోవడంతో పాటు కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాయి. బూత్ స్థాయిలో పార్టీ ప్రతినిధులను కూడా అప్రమత్తం చేశాయి.
ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ నిర్ధారించుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.
