తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే విరాళాలు వేలాది చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్నాయి. టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ఆపన్న హృదయ హస్తం పథకం ద్వారా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నవజాత శిశువులు, చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.
ఈ పథకానికి రూ.1 లక్ష విరాళం అందించే దాతలకు టీటీడీ ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తోంది. ఐదుగురికి ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం, ఉచిత వసతి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేస్తోంది. అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని 80G కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
ఇప్పటివరకు వేలాది మంది దాతలు ఈ పథకానికి సహకరించగా, వారి విరాళాలతో రెండు వేలకుపైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.