Home ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు

తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు

0

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ముంగిట్లో నైరుతి రుతుపవనాలు.. మూడు రోజుల పాటు విస్తార వర్షాలు!

ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గడప తట్టాయి. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

శరవేగంగా ముందుకు సాగుతున్న రుతుపవనాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే నాగాలాండ్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలను పూర్తిగా కమ్మేసిన రుతుపవనాలు త్రిపుర, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు కూడా చేరుకున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వీటి పురోగతికి మరింత బలం చేకూరుస్తోంది.

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాల జోరు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, రానున్న 48 నుంచి 72 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.

దీని ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. అయితే వర్షాలు కురిసినా ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు.

ఏపీ, యానాంలో ద్రోణి ప్రభావం

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, కోస్తా కర్ణాటక నుంచి కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.6 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు వాతావరణంలో గణనీయ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షాల సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

రాయలసీమలో భారీ వర్షాలు.. రైతులకు హెచ్చరిక

రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బలమైన గాలుల కారణంగా పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కోస్తాలో తగ్గని ఉక్కపోత

దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నప్పటికీ, గాలిలో తేమ శాతం పెరగడంతో వేడి, ఉక్కపోత మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే ఐదు రోజుల్లో ఎండల తీవ్రత కొంత తగ్గినా, ఉష్ణోగ్రతలు మాత్రం దాదాపు స్థిరంగానే కొనసాగనున్నాయని అధికారులు పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version