ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కమిషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని బీసీల సామాజిక, రాజకీయ వెనుకబాటుతనంపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 19న మిశ్రా కమిషన్ను ఏర్పాటు చేశారు. అయితే నిర్దేశిత సమయంలో నివేదిక సిద్ధం కాకపోవడంతో ఇప్పటికే పలుమార్లు కమిషన్ గడువును పొడిగించారు. తాజాగా మరోసారి గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మిశ్రా కమిషన్ సమర్పించే నివేదిక కీలకంగా మారింది. తాజా ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 30లోగా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది.
ఈ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.





