ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆయనను అధ్యక్ష స్థానానికి తీసుకెళ్లే విషయంలో అధికార కూటమి సభ్యులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.
బుధవారం మండలి చైర్మన్ మోషేన్ రాజు మాధవరావు ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. అనంతరం సభలో ఉన్న సంప్రదాయం ప్రకారం నూతన డిప్యూటీ చైర్మన్ను సభ్యులంతా కలిసి చైర్ వద్దకు తీసుకెళ్లాల్సి ఉంది. కానీ అధికార పక్షానికి చెందిన సభ్యులు ఎవరూ ఆ ప్రక్రియలో పాల్గొనలేదు. కొందరు సభ నుంచి బయటకు వెళ్లడంతో వైసీపీ సభ్యులే మాధవరావును అధ్యక్ష స్థానానికి తీసుకెళ్లారు.
ఈ ఘటనపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇలాంటి పరిణామం ఎన్నడూ జరగలేదని వ్యాఖ్యానించారు. సభా సంప్రదాయాలను అగౌరవపర్చడం సరికాదని అన్నారు.
మంత్రులు కేవలం రూల్ బుక్ గురించి మాట్లాడకుండా సభా విలువలు, సంప్రదాయాలను పాటించాలని బొత్స సూచించారు. అన్ని పార్టీల సభ్యులను సమదృష్టితో చూడాలని మండలి చైర్మన్ను కోరారు.
