హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొనసాగుతున్న వర్గ రాజకీయాలే ఈ పరిస్థితికి కారణమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలంతా తమ వైఖరిపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
గతంలో తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ నేతలకు బీజేపీ జాతీయ స్థాయిలో కీలక పదవులు దక్కేవని రాజాసింగ్ గుర్తుచేశారు. అయితే ఈసారి జాతీయ కార్యవర్గంలో రాష్ట్రం నుంచి ఒక్కరికీ అవకాశం లభించకపోవడం ఆలోచించాల్సిన అంశమన్నారు.
ఢిల్లీకి ఫిర్యాదుల సంస్కృతి
తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయని రాజాసింగ్ ఆరోపించారు. ప్రతి చిన్న విషయానికీ నేతలు ఢిల్లీకి వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. నాయకుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే రాష్ట్ర నేతలపై అధిష్ఠానానికి ప్రతికూల అభిప్రాయం ఏర్పడి ఉండవచ్చని వ్యాఖ్యానించారు.
‘తెలంగాణ నేతలు మారరు’ అనే అభిప్రాయానికి అధిష్ఠానం వచ్చి ఉండొచ్చని, అందుకే జాతీయ కార్యవర్గంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఇవ్వలేదని రాజాసింగ్ అన్నారు.
ఐక్యంగా పనిచేయాలని పిలుపు
దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసేందుకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతోందని రాజాసింగ్ తెలిపారు. రాష్ట్ర నేతలు వ్యక్తిగత ప్రయోజనాలు, పాత విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం ఐక్యంగా పనిచేయాలని సూచించారు.
పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ ఐక్యంగా పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తేనే భవిష్యత్తులో పార్టీ అధిష్ఠానం గుర్తింపు ఇచ్చి కీలక పదవులు కేటాయిస్తుందని రాజాసింగ్ స్పష్టం చేశారు.






