అనకాపల్లి: పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. పంచదార్ల ప్రాంతాన్ని శాశ్వత ‘నో-మైనింగ్ జోన్’గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.
వైసీపీ నేతల ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లను కలిసి పంచదార్లలో మైనింగ్ కారణంగా ఏర్పడుతున్న సమస్యలను వివరించింది. మైనింగ్, బ్లాస్టింగ్ వల్ల పవిత్ర జలధారలకు నష్టం జరుగుతోందని ఫిర్యాదు చేసింది.
కేంద్ర మంత్రులు ఈ అంశంపై స్పందించి పది రోజుల్లో ఉన్నతస్థాయి బృందాన్ని పంచదార్లకు పంపుతామని హామీ ఇచ్చినట్లు అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి తెలిపారు. బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రులు చెప్పినట్లు ఆమె వెల్లడించారు.
ఇదిలా ఉండగా, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కిందిస్థాయి అధికారులను మాత్రమే సస్పెండ్ చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం లభించదన్నారు.
అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని, దాదాపు రూ.250 కోట్ల జరిమానా విధించాల్సి ఉంటుందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. సుమారు 2 లక్షల టన్నుల గ్రావెల్ను అనుమతించిన పరిమితికి మించి తరలించారని ఆరోపించారు.
పంచదార్లను శాశ్వత నో-మైనింగ్ జోన్గా ప్రకటించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు.





