Home జాతీయం పవన్ శారీరక నొప్పి కంటే తీవ్రమైన ఎన్నో భారాలను మోశారు: అన్నా కొణిదెల

పవన్ శారీరక నొప్పి కంటే తీవ్రమైన ఎన్నో భారాలను మోశారు: అన్నా కొణిదెల

7
0

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు ఇటీవల కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన అర్ధాంగి అన్నా కొణిదెల భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ‘‘పవన్ తన జీవితంలో శారీరక నొప్పి కంటే తీవ్రమైన ఎన్నో భారాలను మోశారు. ఎంతటి కష్టమైనా ఫిర్యాదు చేయని ఆయన, నొప్పి భరించలేని స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే తన బాధను బయటపెడతారు’’ అని ఆమె భావోద్వేగంగా తెలిపారు.

ముంబైలోని ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పరామర్శించిన ఫొటోను అన్నా తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం తన దృష్టంతా పవన్‌ ఆరోగ్యంపైనే ఉందని తెలిపారు. ‘‘ఇప్పుడు నా పని ఒక్కటే.. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవడం. ఆయన సురక్షితంగా ఉన్నారనే నమ్మకం కల్పించడం. ఒక్కో రోజు ముందుకు సాగుతూ ఆయన పూర్తిగా కోలుకుంటారు’’ అని ఆమె భావోద్వేగంగా రాశారు.

జులై 11న పవన్ కల్యాణ్‌కు ముంబైలోని ఆసుపత్రిలో కుడి భుజానికి ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిర్వహించారు. రోటేటర్ కఫ్‌లోని సుప్రాస్పినేటస్, ఇన్‌ఫ్రాస్పినేటస్ టెండన్లకు తీవ్ర గాయం కావడంతో పాటు భుజం ఎముకలో ఫ్రాక్చర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ దిన్‌షా పార్దీవాలా నేతృత్వంలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైందని ఆసుపత్రి ప్రకటించింది.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆరోగ్యంగా కోలుకుంటున్నారని, కొంత విశ్రాంతి అనంతరం ప్రత్యేక రిహాబిలిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వైద్యులు తెలిపారు. సుమారు నాలుగు నెలల్లో భుజం పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం ఉందని ఆరోగ్య బులెటిన్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here