హైదరాబాద్: ఎల్నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం రోజురోజుకు మారుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకవైపు భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, మరోవైపు పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
పలు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, హీట్వేవ్ ప్రభావం కొనసాగుతోంది. తీవ్ర ఎండల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ విడుదల చేసింది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. అరబిక్ మహాసముద్రం, ఆగ్నేయ అరబిక్ మహాసముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలతో పాటు బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.
ఇక ఛత్తీస్గఢ్ను ఆనుకుని ఉన్న తూర్పు విదర్భ ప్రాంతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమైందని వెల్లడించింది. ఈ ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది.
అలాగే తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా దక్షిణ కేరళ వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
ప్రజలు ఎండల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.



