రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, కృష్ణానది మాత్రం జలకళను సంతరించుకుంటోంది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది.
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు సుమారు 32,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి, వచ్చిన నీటిలో దాదాపు 30,700 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహంతో శ్రీశైలం జలాశయానికి కృష్ణానది వేగంగా చేరుతోంది.
ఇక మహారాష్ట్ర, కర్ణాటకలోని పశ్చిమ కనుమలు, భీమా నది పరీవాహక ప్రాంతాల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భీమా నది నుంచి కూడా ప్రవాహం పెరిగితే జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లోలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో శ్రీశైలం జలాశయానికి మరింత నీరు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.






