ములుగు జిల్లా గోవిందరావుపేటలో నిర్వహించిన రైతు మేళాలో మంత్రి దనసరి అనసూయ (సీతక్క) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల మార్పిడి విధానం, సేంద్రియ సాగు, నూతన వంగడాల వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ విధానాల ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి మంచి లాభాలు పొందవచ్చని తెలిపారు.
రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, ఇప్పటివరకు రూ.21 వేల కోట్లను రుణమాఫీ కింద విడుదల చేసినట్లు వెల్లడించారు. అలాగే ధాన్యం కొనుగోలు సందర్భంగా క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు.
ములుగు జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతుండటం ఆనందకర విషయమని పేర్కొన్న ఆమె, రైతులు వాణిజ్య పంటల సాగుపై కూడా దృష్టి సారించి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.






