పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLI)లో మరో కీలక ఘట్టం పూర్తైంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాన్గడ్డ వద్ద ఉన్న లిఫ్ట్-1లో రెండో 145 మెగావాట్ల బాహుబలి మోటర్కు అధికారులు విజయవంతంగా డ్రై రన్ నిర్వహించారు.
శుక్రవారం నిర్వహించిన ఈ పరీక్షలో మోటర్ను సుమారు 10 నిమిషాల పాటు పూర్తి వేగంతో (ఫుల్ స్పీడ్) నడిపినట్లు అధికారులు తెలిపారు. డ్రై రన్ విజయవంతం కావడంతో తదుపరి వెట్ రన్కు అవసరమైన సన్నాహాలు పూర్తయ్యాయని, ఉన్నతాధికారుల ఆదేశాలు అందిన వెంటనే నీటితో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మక సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ పథకంలో అధిక సామర్థ్యం కలిగిన 145 మెగావాట్ల బాహుబలి మోటర్లు వినియోగిస్తున్నారు.
2023 సెప్టెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మోటర్ల ద్వారా కృష్ణా జలాలను నార్లాపూర్ రిజర్వాయర్కు పంపింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఇటీవల కూడా ఇదే మోటర్ ద్వారా పరీక్షలలో భాగంగా నీటిని విజయవంతంగా ఎత్తిపోశారని అధికారులు పేర్కొన్నారు.
ఈ భారీ మోటర్లను ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ (BHEL) తయారు చేసింది. దీర్ఘకాలం తర్వాత కూడా మోటర్లు సాంకేతికంగా సమర్థంగా పనిచేయడం ప్రాజెక్టు నాణ్యతకు నిదర్శనమని ఇంజినీరింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
