కేరళంలో షిగెల్లా ఇన్ఫెక్షన్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. మలప్పురం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడేళ్ల బాలుడు మృతి చెందడంతో రాష్ట్రంలో షిగెల్లా కారణంగా నమోదైన మరణాల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే పలు జిల్లాల్లో నిర్ధారిత, అనుమానిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది.
ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం జూన్ 14 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 138 నిర్ధారిత షిగెల్లా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు కోజికోడ్ జిల్లాలో వెలుగుచూశాయి. అదనంగా 77 అనుమానిత కేసులు కూడా నమోదయ్యాయి. కేవలం జూన్ నెలలోనే 62 నిర్ధారిత కేసులు, 17 అనుమానిత కేసులు నమోదు కావడం వైరస్ వ్యాప్తి తీవ్రతను సూచిస్తోంది.
ప్రస్తుతం కోజికోడ్, వయనాడ్, మలప్పురం, అలప్పుజ, పతనంతిట్ట, ఆరన్ముళ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి ఆహార కేంద్రాలు, పాఠశాల భోజనశాలలు, తాగునీటి వనరులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆహార భద్రతా విభాగాన్ని మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది.
