సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఆగస్టు 2న ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితుల బృందం మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను వెస్ట్ మారేడ్పల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేసింది.
ఈ సందర్భంగా ఉత్సవాల పూర్తి షెడ్యూల్ను ఎమ్మెల్యేకు వివరించారు. జూలై 19న ఘటాల ఊరేగింపుతో బోనాల వేడుకలు ప్రారంభం కానుండగా, ఆగస్టు 2న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. అనంతరం ఆగస్టు 3న సంప్రదాయబద్ధంగా రంగం (భవిష్యవాణి) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాంగోపాల్పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, రాం మోహన్ యాదవ్తో పాటు పలువురు నాయకులు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.
