తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే కొన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
భువనేశ్వర్, కోల్కతా, బంగ్లాదేశ్ సముద్ర ప్రాంతాల సమీపంలో ఏర్పడిన ఈ వ్యవస్థ ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల 24న కోల్కతా సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. అయితే ఇది వాయుగుండంగా బలపడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ అల్పపీడనం ప్రభావంతో ఆగస్టు 22 నుంచి 27 వరకు ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో రాత్రి వేళల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా.
భారీ ఈదురుగాలులకు అవకాశం
వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. ప్రభుత్వ రియల్టైమ్ డేటాలో ఆగస్టు 22న తెల్లవారుజామున కూడా శ్రీకాకుళం, అనకాపల్లి, కర్నూలు, అల్లూరి సీతారామరాజు తదితర జిల్లాల్లో వర్షపాతం నమోదైంది.
తెలంగాణలో మాత్రం కొన్ని జిల్లాల్లో వర్షపాతం లోటు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా అల్పపీడనం తీసుకురానున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది.






