ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి మరిన్ని విదేశీ పెట్టుబడులు, ప్రముఖ కంపెనీలను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు.
2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. ఫార్చూన్-500 కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం, ‘తెలంగాణ రైజింగ్’ విధానం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు.
హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు పరిశ్రమల తరలింపు, మెట్రో విస్తరణ, ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, ఎలక్ట్రిక్ వాహనాలకు జీరో ట్యాక్స్ అమలు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే మూసీ నది పునరుద్ధరణ, CURE ప్రాంత అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్ పరిధిలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కూడా చేపడుతున్నట్లు చెప్పారు.
ఫ్యూచర్ సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామని, వారికి తగిన పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.






