నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేసే వ్యక్తి, బతికున్న తల్లికి మాత్రం ఆస్తిలో వాటా ఇవ్వకుండా క్షోభ పెడుతున్నాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తులు ప్రజలకు ఏం సేవ చేస్తారని ప్రశ్నించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతినే అనేక ఘటనలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. అంతర్వేది రథం దగ్ధం, రామతీర్థం ఘటన, దుర్గగుడిలో వెండి సింహాల చోరీ, తిరుపతి ప్రసాదం వివాదం వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. నిందితులపై తగిన చర్యలు తీసుకోలేదన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మత విద్వేషాలను సహించబోదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కుల, మత రాజకీయాలతో సమాజాన్ని విభజించే ప్రయత్నాలు జరిగాయని, రౌడీయిజం, గంజాయి సంస్కృతిని గత ప్రభుత్వం ప్రోత్సహించిందని విమర్శించారు. సోషల్ మీడియాలో హిందూ పురాణాలను అవమానించే వారిని ప్రోత్సహించడం కూడా ఆందోళనకరమని అన్నారు.
అనంతరం ప్రదర్శన స్టాళ్లను పరిశీలించిన ముఖ్యమంత్రి.. మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ‘స్వయం’ బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేసి వారికి మరింత ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు.





